ఇలా కళ్ళు మూసి అలా తెరిచేసరికి కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. ప్రతి క్షణం చరిత్రగా మారుతోంది. కళ్లముందు ఉన్నవారు కాలగర్భంలో కలిసిపోతుంటే, ఏదో ఒకరోజు మన వంతు కూడా వస్తుందని తెలుసు. కానీ, ఆ నిజాన్ని అంగీకరిస్తూ జీవిత చరమాంకాన్ని పండుగలా మార్చుకోవడానికి మాత్రం సిద్ధపడం. కేవలం ధర్మ వచనాలు వల్లించడానికో, పవిత్ర గ్రంథాలను ఇంట్లో భద్రపరుచుకోవడానికో పరిమితమవుతాం.
భగవద్గీతను కేవలం పూజా మందిరానికే పరిమితం చేస్తే శుభం కలుగుతుందా? అలాగైతే ఆ పుస్తకాన్ని అంటిపెట్టుకుని ఉండే చెదపురుగులే మనకంటే ఎక్కువ జ్ఞానవంతులు అనుకోవాలి. భగవద్గీత కేవలం చదవడానికి కాదు.. బతుకు విలువను తెలుసుకోవడానికి. నైరాశ్యంలో ఉన్నవారికి ధైర్యం చెప్పి, విజయ తీరాలకు చేర్చే అమృత గుళిక అది. సర్వ ధర్మాల, ఉపనిషత్తుల సారం ఈ గీత. భగవంతుడే స్వయంగా గానం చేసిన ఈ గీతామృతాన్ని ఆస్వాదిస్తే పునర్జన్మ ఉండదని వ్యాస భగవానుడు చెప్పారు.
ఇకనైనా కాసేపు మొబైల్ పక్కనపెట్టి, చేతిలోకి భగవద్గీతను తీసుకోండి. అందులోని జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. మీ తలరాత మారడం నిశ్చయం. ఇది గీతాచార్యుడి అభయం.. తిరుగులేని సుదర్శన చక్రం, పాశుపతాస్త్రం!
– ఆదూరి వేంకటేశ్వర రావు
+91 98664 93074
