వైసీపీలో సమన్వయ లోపం.. ప్రత్యామ్నాయ వ్యూహాలపై క్షేత్రస్థాయి సమీక్షలు

YSRCP Rift

YSRCP Rift

YSRCP Rift: ప్రతిపక్షంలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి సమస్యలు, నాయకుల మధ్య సమన్వయం తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం శ్రేణులను కలవరపెడుతున్నాయి. ఇటీవల పలువురు నేతలు చేస్తున్న విమర్శలు పార్టీ నిర్మాణంలో లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

వైసీపీలో జగన్ తర్వాత నిర్ణయాధికారాల వినియోగంపై రాజకీయ వర్గాల్లో మొదటి నుంచీ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. అయితే అధిష్ఠానం నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరడంలో, శ్రేణుల అభిప్రాయాలు పైకి వెళ్లడంలో నెమ్మదిగా జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల పరాజయం తర్వాత పార్టీని పునర్వ్యవస్థీకరించాల్సిన తరుణంలో అధినేతకు క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యక్ష సమాచారం అందడం అత్యంత కీలకంగా మారింది. జిల్లాల స్థాయిలో కనిపిస్తున్న విబేధాలు పార్టీకి సవాలు విసురుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు అంతర్గత పోరును రచ్చకెక్కించాయి. తన తండ్రిపై వచ్చిన విమర్శలను జిల్లా నాయకత్వం ఖండించకపోవడాన్ని ఆయన ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పార్టీపై ప్రత్యక్ష పర్యవేక్షణ పెంచాలని, నాయకులతో తరచూ సంప్రదింపులు జరపాలని రాజకీయా విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడంతో పాటు సొంత పార్టీలోని అసంతృప్తిని ముందే గుర్తించడం కీలకమని భావిస్తున్నారు. అయితే కేడర్‌ను బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపైనే తాము దృష్టి పెట్టామని పార్టీ అధికారికంగా పేర్కొంటోంది.

నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ శ్రేణుల అభిప్రాయాలను సమగ్రంగా స్వీకరించి, అవసరమైన మార్పులు చేస్తేనే రాబోయే కాలంలో పార్టీకి స్పష్టమైన దిశ ఏర్పడుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.