NEWDELHI: జాతీయ క్రీడా పురస్కారాలు…17 మందికి అర్జున అవార్డులు !

17 మందికి అర్జున అవార్డులు

గాయత్రి గోపీచంద్, దివ్య దేశ్‌ముఖ్, విదిత్ గుజరాతి సహా పలువురు స్టార్ అథ్లెట్లకు పురస్కారాలు

ఈసారి ఎవరికీ దక్కని మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 19): ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారాలు-2025ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ఖరారు చేసింది. వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 17 మంది అథ్లెట్లను ‘అర్జున అవార్డు’లకు ఎంపిక చేశారు. అయితే, ఈసారి దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డును ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం.

అర్జున అవార్డుకు ఎంపికైన వారిలో యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, ప్రముఖ బ్యాడ్మింటన్ షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రీసా జాలీ, చెస్ గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి, డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్, డెఫ్ రైఫిల్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, బాక్సర్ నరేందర్ తదితరులు ఉన్నారు.

మరోవైపు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మాజీ ఫుట్‌బాలర్ ఐ. అరుణై నాయగమ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అర్జున పురస్కారాన్ని ప్రకటించారు. వివిధ క్రీడల్లో అత్యుత్తమ సేవలు అందించిన ఐదుగురు కోచ్‌లకు డ్రోణాచార్య అవార్డులు దక్కగా, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణేకు చెందిన ఆర్మీ పారాలింపిక్ నోడ్ కైవసం చేసుకుంది.