hyderabad: వృద్ధులే టార్గెట్.. 19 నెలల్లో రూ.102 కోట్లు హాంఫట్ !

19 నెలల్లో రూ.102 కోట్లు హాంఫట్
సైబర్ మాయగాళ్ల మోసాలపై సీపీ సజ్జనార్

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 10): జీవితకాలమంతా రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న రిటైర్మెంట్ డబ్బును వృద్ధులు కళ్లముందే పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 19 నెలల కాలంలోనే సైబర్ కేటుగాళ్లు సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని ఏకంగా రూ.102 కోట్లను దోచుకున్నారని పోలీసుల అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంలో వారి ఆందోళనను, సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న అవగాహనా రాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని నెట్ నేరగాళ్లు ఈ స్థాయిలో దోపిడీకి పాల్పడటంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ భారీ దోపిడీ వెనుక రకరకాల కుతంత్రాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి సీనియర్ సిటిజన్ల నుంచి ఏకంగా రూ.55.88 కోట్లను కాజేశారు. ఇక ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిన ‘డిజిటల్ అరెస్ట్’ బెదిరింపులకు భయపడి 69 కేసుల్లో వృద్ధులు రూ.31.93 కోట్లు సమర్పించుకున్నారు. వీటికి తోడు నకిలీ బ్యాంక్ ప్రతినిధుల మాటలు నమ్మి ఓటీపీలు చెప్పడంతో రూ.4.94 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ద్వారా రూ.2.79 కోట్లు నష్టపోగా, హనీట్రాప్, డేటింగ్ యాప్‌ల మోసాల బారినపడి మరొక రూ.70 లక్షల వరకు పోగొట్టుకున్నారు. ఇంట్లోని పిల్లలు, కుటుంబ సభ్యులు బిజీ లైఫ్‌లో పడి వృద్ధుల డిజిటల్ కార్యకలాపాలను, ఆర్థిక లావాదేవీలను సరిగా గమనించకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. పెద్దవాళ్లు ఫోన్లలో ఏం చేస్తున్నారు, సడన్‌గా ఎందుకు ఆందోళన చెందుతున్నారనే విషయాలను ముందే పసిగట్టకపోవడం వల్ల తీరా మోసపోయాక పోలీసులను ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లోనూ వృద్ధులపై పర్యవేక్షణ ఉండాలని, వారికి సైబర్ మోసాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సీపీ స్పష్టం చేశారు.

అలాగే బ్యాంకర్లు కూడా ఈ విషయంలో కీలక బాధ్యత వహించాలని సీపీ సజ్జనార్ సూచించారు. సీనియర్ సిటిజన్లు ఉన్నట్టుండి తమ ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసినా, లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో వేరే ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నా బ్యాంక్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆరా తీయాలన్నారు. వృద్ధులు తమ ఆన్‌లైన్ లావాదేవీలపై పరిమితులు విధించుకోవాలని, ఆర్థికంగా ఏమాత్రం అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.