NARENDRAMODI: మాజీ రాష్ట్రపతి ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో ప్రధాని మోదీ !

జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దు
కష్టాల్లోను విలువలు వదలని కోవింద్
మాజీ రాష్ట్రపతి ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో ప్రధాని మోదీ

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ(ఆగస్ట్ 13): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ఒక హెచ్చరికను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. “షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్” (అడ్డదారి మీ జీవితాన్ని కుదిస్తుంది) అనే బోర్డు కేవలం రైల్వే ట్రాక్‌లకే కాకుండా, నిజ జీవితానికి కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరగా వెళ్లాలనే తొందరలో కొందరు ప్రమాదకరంగా పట్టాలు దాటుతుంటారని, అటువంటి అనాలోచిత నిర్ణయాలు ప్రాణాంతకమని హెచ్చరించారు.

యువత తప్పుడు మార్గాలను వీడి, అర్థవంతమైన జీవన గమనాన్ని ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదివి స్ఫూర్తి పొందాలని సలహా ఇచ్చారు. ముఖ్యంగా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్ పట్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

కష్టాల్లోనూ విలువలను వదలని జీవితం

రామ్‌నాథ్ కోవింద్ జీవితంలోని పేదరికం, పరిమిత వనరులు, కష్టాలను ప్రస్తావించిన ప్రధాని, వాటిని ఆయన బలహీనతలుగా మారనివ్వలేదన్నారు. విద్య, కష్టపడి పనిచేయడం, నిజాయితీ, సేవాభావం వంటి విలువలతో ఆయన అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకున్నారని గుర్తు చేశారు. రామ్‌నాథ్ కోవింద్ చిన్నతనంలో ఆయన తల్లి అగ్నిప్రమాదంలో మరణించిన విషాద సంఘటనను ప్రస్తావిస్తూ.. ఆ కష్ట సమయంలో పొరుగింటి మహిళ కుటుంబానికి అండగా నిలిచిన సంఘటన ఆయనలో సామాజిక ఐక్యత, సామరస్యంపై లోతైన అవగాహన పెంచిందని వివరించారు.

మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులు పేదలు, అణగారిన వర్గాలకు కూడా దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండాలని కలలు కన్నారని, రామ్‌నాథ్ కోవింద్ తమ కృషి, సామర్థ్యంతో ఆ కలను సాకారం చేశారని కొనియాడారు. భవిష్యత్తులో దేశానికి ఇలాంటి అంకితభావం కలిగిన లక్షలాది మంది యువత అవసరమని సందేశం ఇచ్చారు.

“ఒకే దేశం, ఒకే ఎన్నిక” కోసం కోవింద్ సేవలు

రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రత్యేకంగా “ఒకే దేశం, ఒకే ఎన్నిక” అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ భారత ప్రజాస్వామ్య ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను భవిష్యత్ తరాలకు భద్రపరుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.