జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి
ప్రధాన కార్యదర్శులుగా స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే
కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ(ఆగస్ట్ 18): భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా ప్రకటించారు. సంస్థాగత బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కమిటీని రూపొందించినట్లు వెల్లడించారు. నూతనంగా నియామకమైన నాయకులు తక్షణమే తమ బాధ్యతలను స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ కొత్త కార్యవర్గంలో మొత్తం 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కీలక స్థానం దక్కింది. అయితే తెలంగాణకు చెందిన ఏ ఒక్క నాయకుడికి ఈ కార్యవర్గంలో అవకాశం లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు వినోద్ తావ్డేలను నియమించారు. వీరు పార్టీ సంస్థాగత వ్యవహారాలు, వివిధ రాష్ట్రాల సమన్వయంలో కీలక పాత్ర పోషించనున్నారు.
