Vinayaka Chavithi: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగ సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక ఉత్సవమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
విఘ్నాలను తొలగించి విజయాలను అందించే బొజ్జ గణపయ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మట్టి వినాయక ప్రతిమలనే పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, మన సంస్కృతి సంప్రదాయాలను వైభవంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని కృపతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని వారు ఆకాంక్షించారు. పర్యావరణహిత పద్ధతుల్లో పండుగను ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
