సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ!
సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేతపై పిటిషన్ కొట్టివేత
హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసిన ధర్మాసనం
క్రిమినల్ కేసుల పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 26): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చుక్కెదురైంది. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో అక్రమంగా నిలిపివేశారంటూ వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
కర్నూలులో నమోదు చేసిన రెండు కేసులు, గుంటూరు జిల్లాలో ఒక కేసుతో పాటు సీఐడీ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసుల వివరాలను పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
రాష్ట్ర పరిధిలోని పోలీస్ కేసులు, సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వంటి అంశాలపై ఏమైనా అభ్యంతరాలు లేదా ఇబ్బందులు ఉంటే మొదట ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్తూ వ్యాజ్యాన్ని ముగించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో వైసీపీ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
