అస్తవ్యస్తంగా డ్రైనేజీ, రోడ్లు.. పూటకో చోట కనపడుతున్న అవస్థలు
అప్పటికప్పుడు పరిష్కారాలు.. శాశ్వతంగా కనపడని మార్గాలు
సోషల్ మీడియాలో మాత్రం మల్కాజిగిరి అధికారుల డైలీ అప్డేట్లు
అదేదో రోడ్లు, డ్రైనేజీలపై పెడితే బాగుణ్ణు కదా అంటున్న సిటిజెన్లు
మినిట్2మినిట్ డెస్క్, మల్కాజ్గిరి: మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు బాగున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా మెయిన్ రోడ్ల దుస్థితి, అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికార యంత్రాంగం ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. నిత్య జీవితాన్ని అతలాకుతలం చేసే రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కానంతవరకు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవ్వడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు స్పందించని పరిస్థితి మారాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించేలా వ్యవస్థ చురుగ్గా పనిచేయాలని జనం ఆశిస్తున్నారు. లేదంటే అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయే ప్రమాదం ఉందని, నిత్యం విమర్శలు, శాపనార్థాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
మల్కాజ్గిరి కమిషనరేట్కు మంచి పేరు రావాలన్నా, ప్రజల్లో విశ్వాసం పెరగాలన్నా నాలుగు ప్రధాన అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సి ఉంది:
రోడ్ల మరమ్మత్తులు: ముఖ్యంగా మెయిన్ రోడ్లను గుంతలు లేకుండా, ప్రయాణానికి అనువుగా మార్చడం.
డ్రైనేజీ వ్యవస్థ: మురుగునీరు రోడ్లపైకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపడం.
పారిశుద్ధ్యం: నిరంతరం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ నియోజకవర్గాన్ని క్లీన్గా ఉంచడం.
ట్రాఫిక్ నియంత్రణ: వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడం.
ఈ నాలుగు విభాగాల్లో మున్సిపల్ కమిషనరేట్ ఎంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తే.. అంతగా ప్రజల మన్ననలు పొందుతుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేయాలని మల్కాజ్గిరి ప్రజలు కోరుతున్నారు.
